ఏపీలో ఉపాధ్యాయుల హాజరు నమోదులో 10 నిమిషాల సడలింపు

  • 9 గంటలకు నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్‌గా పరిగణన
  • ఉపాధ్యాయుల ఆందోళనతో ప్రభుత్వం సడలింపులు
  • ఇతర ఉపాధ్యాయుల ఫోన్ నుంచి హాజరు వేసుకునేందుకు అనుమతి
ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం సడలింపులిచ్చింది. తొలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంట్‌గా పరిగణించేలా యాప్‌ను సిద్ధం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో దిగొచ్చిన ప్రభుత్వం 9 గంటలకు మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, ఉపాధ్యాయులు 9.10 గంటలలోపు ఫేస్‌ రికగ్నిషన్ ద్వారా హాజరు వేసుకోవచ్చు. అలాగే, మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. 

నెట్‌వర్క్ సమస్యల కారణంగా యాప్ పనిచేయకుంటే ఆఫ్‌లైన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు పొరపాటున సెల్‌ఫోన్ మర్చిపోయి స్కూలుకు వస్తే సహోపాధ్యాయుల సెల్ ఫోన్ ద్వారా, లేదంటే ప్రధానోపాధ్యాయుడి సెల్‌ఫోన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు. అలాగే, డిప్యుటేషన్, శిక్షణ తదితర వాటికి వెళ్లినప్పుడు, ఆన్‌డ్యూటీలో ఉన్న వారి కోసం ఈ నెల 25 నుంచి ప్రత్యేకంగా లీవ్ మాడ్యూల్‌ను తీసుకురానుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సెలవుల వివరాలను కూడా యాప్‌లోనే అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

Andhra Pradesh
Teachers
Face Recognition Attendance

More Telugu News